Tuesday, February 1, 2011

నమ్మమంటారా సిఎం సారూ...!

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ మధ్య నమ్మలేని నిజాలు మాట్లాడుతున్నారు. వాటిని ఎలా నమ్మాలో మాత్రం చెప్పట్లేదు. వైఎస్‌ రాజశేఖరరెడ్డికి మాజీ ప్రధాని పివి నర్సింహారావు నుండి అప్పాయింట్‌మెంట్‌ తానే ఇప్పించానన్నారు కిరణ్‌కుమార్‌. అంతేకాదు వైఎస్‌కు పావలావడ్డీ ఐడియా ఇచ్చింది కూడా తానేనని స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్‌ ఇస్తామని 1999 ఎన్నికల్లో వైఎస్‌ హామీ ఇచ్చినా ఓట్లు రాల్లేదని విశ్లేషించారు. వైఎస్‌ ఒక్కరి వల్లనే రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాలేదని, తనలాంటి వారందరూ ఒక్కో ఇటుక పేర్చడం వల్లనే రెండుసార్లూ అధికారం దక్కిందని వెల్లడించారు. జగన్‌ విషయం అసలు తమకు పెద్ద విషయమే కాదని కొట్టి పారేశారు. జగన్‌ పక్కన ఉన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా తమ ప్రభుత్వానికి ఢోకా లేదని ఢంకా భజాయిస్తున్నారు. దమ్ముంటే రాజీనామా చేయాలని ఆ ఎమ్మెల్యేలకు సవాల్‌ కూడా చేశారు. పరిటాల రవి హత్య కేసులో జగన్‌ను రక్షించడానికి తాను అసెంబ్లీలో చర్చలో పాల్గొన్నట్లు చెప్పుకొచ్చారు. ఇన్ని నమ్మలేని నిజాలు చెబుతున్న కిరణ్‌కుమార్‌రెడ్డి తాను జూబ్లీహిల్స్‌లో ఆక్రమంగా ఆక్రమించిన స్థలం గురించి మాత్రం నీళ్లు నములుతున్నారు. సక్రమంగానే భూమిని స్వాధీనం చేసుకున్నానని ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజున మీడియాతో వాదించారు. ఈ నమ్మలేని నిజాలను ప్రజలు నమ్ముతారంటారా?

No comments:

Post a Comment