Friday, February 4, 2011

కిరణ్‌ సర్కార్‌కు జగన్‌ గుబులు

రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి జగన్‌ ఫోబియా పట్టి పీడిస్తోంది. పైకి జగన్‌కు భయపడేది లేదని, అతనో బచ్చా అని తీసి పారేస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్‌ నేతలు ఎందుకనో ఉలిక్కి పడుతున్నారు. విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకానికి ప్రభుత్వం నిధులివ్వట్లేదని, త్వరలో ఆ సమస్యపై ధర్నా చేస్తానని జగన్‌ ప్రకటించారు. ఆ వెంటనే ప్రభుత్వంలో, రాజకీయంగా ఒక్కసారిగా కదలికొచ్చింది. కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఆ సమస్యపై మేల్కొని ప్రభుత్వానికి డిమాండ్లు చేయనారంభించాయి. అంతలోనే హైదరాబాద్‌ శివారుల్లో ఒక విద్యార్థిని ఫీజురీయింబర్స్‌మెంట్‌ అందక, కాలేజీ యాజమాన్యం వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ వార్త మీడియాలో వచ్చింది. జగన్‌కు చెందిన పత్రికలో కాస్త ప్రముఖంగా ప్రచురితమైంది. విద్యార్థిని ఆత్మహత్యలపై స్పందించిన జగన్‌ తాను 18న హైదరాబాద్‌లో ఫీజురీయింబర్స్‌మెంట్‌పై ధర్నా చేస్తానని తేదీ సమయం సైతం ప్రకటించారు. అంతే.. ప్రభుత్వంలో వణుకు మొదలైంది.

ఇప్పటికే జగన్‌ విజయవాడలో లక్ష్యదీక్ష, ఢిల్లీలో జలదీక్ష చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌లో మరో సమస్యపై ధర్నా చేయబోతున్నారు. జగన్‌ ధర్నా ప్రకటనతో ప్రభుత్వంలో కలకలం బయలుదేరింది. అప్పటి వరకూ 'ఫీజు'లపై పట్టించుకోని ప్రభుత్వం ఏకంగా ఎనిమిది మంది మంత్రులతో కమిటీని ఏర్పాటు చేస్తూ గురువారం హడావిడిగా ఉత్తర్వులిచ్చింది. ఫీజులు అందకపోతే కాలేజీ యాజామాన్యాలపై ఒత్తిడి చేయాలని ఒక రోజు ముందు ఉచిత సలహా ఇచ్చిన మంత్రి బొత్స గురువారం ఆఘమేఘాల మీద సచివాలయంలో ప్రెస్‌మీట్‌పెట్టి విద్యార్థిని ఫీజు అందక ఆత్మహత్య చేసుకోలేదని, ఆమె మరణాన్ని ఒక పత్రిక, కొందరు నాయకులు, ప్రతిపక్ష నేతలు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.

విద్యార్థిని కుటుంబాన్ని రేపో మాపో జగన్‌ పరామర్శించనున్నారని ప్రకటన వెలువడటంతో తాము వెనుకపడకూడదన్న ఉద్దేశంతో టిడిపి నేతలు గురువారమే విద్యార్థిని ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జగన్‌ ధర్నా చేసే తేదీకి ప్రాధాన్యత ఉంది. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 14 లేదా 18 నుండి ప్రారంభమవుతున్నాయంటున్నారు. సరిగ్గా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో జగన్‌ హైదరాబాద్‌లో ధర్నా చేస్తానని ప్రకటించడంతో కాంగ్రెస్‌ పార్టీలో, ప్రభుత్వంలో గుబులు రేగుతోంది.

No comments:

Post a Comment