Thursday, February 3, 2011

రాజా అరెస్టు సరిపోదు

దాదాపు 1.76 లక్షల కోట్ల రూపాయలకు పైబడిన 2జి స్పెక్ట్రం స్కామ్‌ నుండి ఎలా బయట పడాలా అని ఆలోచిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఎలాగొలా గండం గట్టెందుకు పావులు కదుపుతోంది. కుంభకోణం సమయంలో టెలికం మంత్రిగా ఉన్న డిఎంకె నేత ఎ. రాజాను పదవి నుండి తప్పించినా ప్రతిపక్షాలు ఊరుకోలేదు. జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)ని ఏర్పాటు చేసి సమగ్రంగా విచారించాలని అవి పట్టుబట్టాయి. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో జెపిసి ఏర్పాటుకు ప్రభుత్వం నిరాకరించింది. ప్రతిపక్షాలు జెపిసి కోసం పట్టుబట్టడంతో సమావేశాలు జరగలేదు. ఒక సెషన్‌ మొత్తం ఈ విధంగా అంతరాయాలతో ముగియడం పార్లమెంట్‌ చరిత్రలో రికార్డు. ఈ నెలలోనే పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతాయి. జెపిసిపై ప్రతిపక్షాలు మరింతగా పట్టుబట్టడం ఖాయం. ఈ గండం నుండి ప్రభుత్వం గట్టే క్రమంలో మాజీ మంత్రి రాజా అరెస్టు బుధవారం జరిగింది.

ప్రధాన మంత్రి కార్యాలయంపైనే ఆరోపణలు రాగా పెద్ద చేపలను వదిలిపెట్టి రాజా, ఆయన సహాయకుల అరెస్టుతో సరిపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. కేవలం రాజా అరెస్టుతోనే వేల కోట్ల రూపాయల స్కామ్‌ మాఫీ చేయాలనుకుంటే కుదరదు. ఈ స్కామ్‌కు బాధ్యులైన ప్రతి ఒక్కరినీ శిక్షించాలి. అందుకు అవసరమైన విచారణ జరగాలి. జెపిసి ద్వారా విచారణ జరిపితేనే వాస్తవాలు బయట పడతాయి. పిఎసి ముందు హాజరవుతానన్న ప్రధాని ప్రకటన చెల్లేది కాదు. పిఎసి వద్ద పిఎం హాజరు కాబోరన్నారు ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ. ఈ దొంగాట కట్టిపెట్టి జెపిసి ఏర్పాటు చేసి స్కామ్‌పై విచారించాలి. బాధ్యులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలి.

అంతేకాదు ప్రభుత్వానికి రావాల్సిన వేలాది కోట్ల రూపాయలనూ టెలికం కంపెనీల నుండి వసూలు చేయాలి. అప్పుడే కేంద్ర ప్రభుత్వ, కాంగ్రెస్‌ పార్టీ సచ్ఛీలత నిరూపితమవుతుంది. లేకపోతే స్కాములతో నిండా మునిగిన కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించడం ఖాయం.

No comments:

Post a Comment