Wednesday, February 23, 2011

సర్కార్‌కు మేలు..ప్రజలకు కీడు

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరపకుండా తీర్మానం సభ ఆమోదం పొందడం ఇదే తొలిసారి. టిఆర్‌ఎస్‌, టిడిపి తెలంగాణ ఫోరం ఎమ్మెల్యేలు సభలో గొడవ చేస్తూనే ఉన్నారు. ఈ నెల 18న గవర్నర్‌ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకోవడం, దానికి టిడిపి, టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఐదుగురు వారం రోజుల పాటు సస్పెన్షన్‌ కావడం జరిగిపోయాయి. శని, ఆదివారాలు అసెంబ్లీకి శెలవు. శుక్ర, సోమ, మంగళవారాల్లో సభ సమావేశమైనా టిఆర్‌ఎస్‌. టిడిపి సభ్యుల లొల్లితో ఎటువంటి చర్చా లేకుండానే వాయిదా పడింది. నిబంధనల ప్రకారం గవర్నర్‌ ప్రసంగానికి అసెంబ్లీ ధన్యవాదాలు తెపాలి. ప్రసంగంలోని అంశాలపై అన్ని పార్టీలూ చర్చించాలి.

రాబోయే సంవత్సరానికి ప్రభుత్వ దశ, దిశ తెలియేజేసే గవర్నర్‌ ప్రసంగంలోని లోటుపాట్లపై సలహాలు ఇవ్వాలి. పార్టీలు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. అది ఆనవాయితీ. ఈసారి ప్రత్యేక తెలంగాణ ఆందోళనల మూలంగా చర్చ లేకుండానే గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానం సభలో ఆమోదం పొందింది. ప్రతిపక్షాలు మాట్లాడకుండానే చీఫ్‌విప్‌ ప్రవేశపెట్టిన తీర్మానంపై సిఎం తూతూ మంత్రంలా సమాధానం చెప్పారు. ఎలాగూ కాంగ్రెస్‌ సభ్యులు సభలో ఎక్కువ మంది ఉంటారు కనుక మూజువాణి ఓటుతో తీర్మానం పాస్‌ అయింది.

ఈ విధంగా తీర్మానం పాస్‌ కావడం ఇదే తొలిసారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2000లో చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలు పెంచినప్పుడు బడ్జెట్‌ సమావేశాలు జరిగాయి. వైఎస్‌ అప్పుడు సిఎల్పీ లీడర్‌. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా. ఆయన ఆధ్యర్యంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు విద్యుత్‌ ఛార్జీలకు వ్యతిరేకంగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. సిపిఎం ఎమ్మెల్యేలు కూడా దీక్ష చేశారు. చలో అసెంబ్లీ సందర్భంగా బషీర్‌బాగ్‌లో పోలీస్‌ కాల్పులు జరిగాయి. అప్పుడు సైతం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై చర్చ జరిగింది. వైఎస్‌ దీక్ష వీడాక చర్చలో పాల్గొన్నారు.

ఈసారైతే మరీఘోరం. చర్చ లేకుండానే తీర్మానం ఆమోదం పొందింది. ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రధాన పార్టీలు తమ రాజకీయ స్వలాభం కోసం పాకులాడాయి. గవర్నర్‌ ప్రసంగంపై చర్చించేటప్పుడు తెలంగాణ సమస్యపై కూడా సభలో ప్రస్తావించి తమ అభిప్రాయం చెప్పవచ్చు. కాని అందుకు టిఆర్‌ఎస్‌, టిడిపి సిద్ధ పడలేదు. గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకున్న ఆ పార్టీలు ఆయనకు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఎందుకు మాట్లాడతాయి?

కొన్ని పార్టీలు సభలో లొల్లి పెట్టడం, సభ వాయిదా పడటం, చర్చ లేకుండా తీర్మానం ఆమోదం పొందడం.. ఈవన్నీ ప్రభుత్వానికి కావాలి. సభలో ఎంత చర్చ లేకుండా ఉంటే అంత ప్రభుత్వానికి మంచిది మరి! ఎంచక్కా సమాధానం చెప్పేందుకు కష్టపడకుండా తప్పించుకోడానికి ఉపయోగపడుతుంది. గొడవ చేసిన ప్రజాప్రతినిధులు సర్కార్‌కు మేలు, ప్రజలకు కీడు చేశారని చెప్పక తప్పదు.

1 comment:

  1. కుసింత ఇటు ఓ లుక్కేసి మీ అభిప్రాయం చెప్పండి గురువుగారూ
    http://blogavadgeetha.blogspot.com/2011/02/blog-post_23.html

    ReplyDelete