Monday, December 13, 2010

కిరణ్‌కు మెచ్యురిటీ కొరత!

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మూడు నాలుగు తడవలు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ రాజకీయంగా మెచ్యురిటీ కాలేదనిపిస్తోంది. ఎమ్మెల్యేగా, చీఫ్‌విప్‌గా, స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించినా సరిగ్గా రాజకీయాలు వంటబట్టించుకోలేదు. బాధ్యతాయుత స్థానంలో ఉన్న నేత ఎలా మాట్లాడకూడదో అలా మాట్లాడుతున్నారు. సీనియర్‌ రాజకీయవేత్త నల్లారి అమర్‌నాథ్‌రెడ్డి వారసుడైనప్పటికీ ఈ విధంగా ఎందుకు చేస్తున్నారో కాంగ్రెస్‌ నేతలకే అంతుబట్టకుండా ఉంది. వైఎస్‌ ఉన్నంత కాలం తండ్రిచాటు బిడ్డలా పదవుల్లో ఒదిగిపోయిన కిరణ్‌ను కాంగ్రెస్‌ అధిష్టానం ఊహించని రీతితో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడితే అసెంబ్లీలో, బయట మీడియా ముందు ఆయన స్పందిస్తున్న తీరులో మెచ్యురిటీ లోపిస్తోంది. స్పీకర్‌గా సంవత్సరంన్నర పని చేసి అందరి చేత అధ్యక్షా అని పిలిపించుకున్న కిరణ్‌, తాను సిఎం స్థానం నుండి మాట్లాడాల్సి వచ్చే సరికి ఆ మాట మర్చిపోయారు. నేరుగా టిఆర్‌ఎస్‌, ఎంఐఎం ఎమ్మెల్యేలనుద్దేశించి మాట్లాడారు.

అసెంబ్లీ చర్చల్లో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటున్నారంటే ఏదోక మెసేజ్‌ ఇస్తారనుకుంటారు సభలోని సభ్యులు. పేజివన్‌ వార్త వస్తుందనుకుంటారు పాత్రికేయులు. అందుకు భిన్నంగా ఉంది సిఎం స్పందన. 'నేనూ స్టూడెంట్‌ లీడర్‌ నుండి పైకొచ్చా, నూనూ హైదరాబాదీనే' అని పాత కబుర్లు చెప్పారు. భారీవర్షాలకు నష్టం లెక్కలు బయటికి రాకముందే పాతిక లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని చిన్నగా వదిలారు. అసెంబ్లీలో సిఎం 'పాతిక లక్షల ఎకరాల్లో నష్టం' అని చెబితే మీడియాలో ప్రధానంగా రావాలి. కాని రాలేదు. కారణం ఆయన మెచ్యురిటీ లేనితనం.

ఢిల్లీకి పోయి విలేకరుల వద్ద కిరణ్‌కుమార్‌ స్పందన సైతం పరిణితి లేదని నిరూపించింది. సభను నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికెంత ఉందో ప్రతిపక్షానికీ అంతే ఉందన్నారు. సభను నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఎక్కువుటుందన్న సంగతి మరిచారు. సభ వాయిదా పడుతుండటంపై 'సభను నడిపించుకోపోతే ప్రజలు, ప్రతిపక్షాలే నష్టపోతాయి' అన్నారు. ప్రతిపక్షాలు నష్టపోతే కాంగ్రెస్‌కు లాభం. ప్రజలు నష్టపోతే ప్రభుత్వానికి నష్టం. ఆ సంగతి తెలిసే ఆ విధంగా మాట్లాడారా? ప్రజలకు మేలు చేయాల్సిన ముఖ్యమంత్రి స్థానంలో ఉంది ప్రజలకు నష్టం జరుగుతుంది, మాకేం కాదు అని చెప్పడమేంటి? అత్యున్నత శాసనసభను వదిలేసి ప్రజాసమస్యల గురించి చెప్పుకోడానికి ప్రభుత్వానికి వేరే వేదికలున్నాయని, ప్రతిపక్షానికి అసెంబ్లీ ఒక్కటే వేదిక అని చెప్పడం దేన్ని సూచిస్తుంది? అసెంబ్లీ ప్రభుత్వానికి వేదిక కాదని సిఎం ఎలా చెబుతారు?

స్పీకర్‌ లేకుండా సభ జరుగుతుందని, డిప్యూటి స్పీకర్‌, ప్యానల్‌ స్పీకర్‌ ఎవరో ఒకరు అధ్యక్ష స్థానంలో కూర్చుంటే సభాపతిగానే చూస్తారన్నారు ముఖ్యమంత్రి. స్పీకర్‌ అంటూ ఒకరుంటే ఇవన్నీ. స్పీకర్‌ లేకుండా అసెంబ్లీని నడుపుతూ కుర్చీలో ఎవరైనా కూర్చోవచ్చు అన్న విధంగా చెప్పడమూ పరిణితి లేని తనాన్ని తెలియజేస్తోంది. సలహాదారుల రాజీనామాలు తానే కోరినట్లు తొలివిడత ఢిల్లీ పర్యటనలో మీడియాకు చెప్పారు. రాజీనామాలు ఎందుకు ఆమోదించలేదని అడిగితే మీకు చెప్పాలా అన్నారు. అవన్నీసరే, విద్యార్థులపై కేసులు ఎత్తివేతపై ప్రభుత్వం ఎందుకు ప్రకటన చేయలేక పోతోంది? రెండు రోజుల సభా సమయం వృధా కావడానికి ఎవరు కారణం? రైతు సమస్యలపై చర్చ జరగకపోవడానికి ప్రభుత్వానికి బాధ్యత ఉందా లేదా? తూర్పుగోదారి జిల్లా వెళ్లి వేరుశనగ గురించి సిఎం మాట్లాడటంపై టిడిపి నేత చంద్రబాబు హేళన చేస్తున్నారు. ముఖ్యమంత్రికి ఖరీఫ్‌, రబీ అంటే తెలీదని టిడిపి నేతలు, మెచ్యురిటీ లేదని కాంగ్రెస్‌ నేతలు చెప్పుకోవడానికి ఆయన వ్యవహారశైలే కారణం.

1 comment:

  1. "పరిణితి" అంటూ ఈ పదం ఎందుకు ఎలా ప్రచారంలోకి వచ్చిందో తెలియకుండా ఉంది. పరిణామానికి వ్యాకరణపరమైన రూపాంతరమే పరిణతి. అది "పరిణితి" కాదు.

    ReplyDelete