Wednesday, December 22, 2010

ఆ ఎమ్మెల్యేలపై చర్య తీసుకునే ధైర్యం కాంగ్రెస్‌కు ఉందా?

వైఎస్‌ జగన్‌ విజయవాడలో ప్రారంభించిన లక్ష్య దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే ధైర్యం కాంగ్రెస్‌కు ఉందా? అసెంబ్లీలో కాంగ్రెస్‌, బయట జగన్‌ అంటున్న ఎమ్మెల్యేలకు పార్టీ ఫిరాయింపు చట్టం వర్తిస్తుందా? ఈ ప్రశ్నలు రాష్ట్ర ప్రజానీకాన్ని, మరీ ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులను, మరీ మరీ ముఖ్యంగా కాంగ్రెస్‌ నేతలను బుర్రలు బద్దలు కొడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ఓదార్పుయాత్ర చివరిరోజు రాజమండ్రిలో జరిగిన జగన్‌ బహిరంగసభలో 20 మందికిపైగా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇప్పుడు విజయవాడలో కూడా ఒకరిద్దరు పెరిగినా తగ్గినా 25 మంది ఎమ్మెల్యేలైతే పక్కాగా మంగళవారంనాటి లక్ష్యదీక్షకు మద్దతిచ్చారు. నలుగురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు సరేసరి. 
 
ఇప్పుడు చర్చ లక్ష్యదీక్షకు లక్ష మంది వచ్చారా లేదా? వచ్చినవారందరూ రైతులా కాదా అన్నది కాదు. కాంగ్రెస్‌లోనే ఉండి ఓదార్పుయాత్ర చేసినప్పుడు పార్టీ ఎమ్మెల్యేలు ఆయన పక్కన తిరిగినా ఫర్వాలేదు. కాంగ్రెస్‌ను వీడి కొత్తపార్టీని పెడతానని ప్రకటించిన తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న లక్ష్యదీక్షలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పాల్గొనడమే హాట్‌ టాపిక్‌. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య 148. ప్రస్తుతం కాంగ్రెస్‌కు 155 మంది ఎమ్మెల్యేలున్నారు. జగన్‌ సభకు వెళ్లింది పాతికమంది. మరిప్పుడు నైతికంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనార్టీలో పడ్డట్టే అవుతుంది. కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా కొనసాగుతాం, జగన్‌కు మద్దతిస్తాం అంటే ఎంత వరకూ సమంజసం. విహెచ్‌, శంకర్రావు వంటివారు జగన్‌ దీక్షకు మద్దతిచ్చిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయమంటున్నారు. మంత్రి డిఎల్‌ రవీంద్రారెడ్డి తమ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే సమర్ధవంతంగా ఎదుర్కొంటామంటున్నారు. వీరు నిజంగానే అంత నమ్మకంతో ఉన్నారా? లేక మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారా? జగన్‌ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వాన్ని పడగొట్టరన్న ధీమాతో ఉన్నారా? టిఆర్‌ఎస్‌, ఎంఐఎం, పిఆర్‌పి, స్వతంత్రుల మద్దతు పొందైనా ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడంపై విశ్వాసంతో ఉన్నారా? జగన్‌ పక్కన 40 మంది కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు పోతేనే ప్రభుత్వానికి ఇబ్బందని, అంత సీన్‌ లేదని నమ్ముతున్నారా? ఈ ప్రభుత్వానికి పోయేకాలం వచ్చిందని జగన్‌ తన ప్రసంగంలోని మాటలో అంతరార్ధం ఏమిటో...

2 comments:

  1. మీ రాసిన ఈ అనాలిసిస్ వలన ఎమైనా సమాజానికి ప్రయోజనం ఉందా? రామాయణం లో మందర కైకేయికి మనసు మార్చటానికి చెప్పిన మాటలు లా ఉన్నాది మీ అనాలిసిస్. మీరు రాసినది జగన్ మీద చర్య తీసుకో లేక పోవటం ఒక అసమర్ధత లా కాంగ్రెస్ పార్టీని, వారి నాయకులను ఎత్తి పొడవటం, జగన్ వర్గాన్ని మరీ ఎక్కువ చేసి చూపటం ఇలా రాసుకొంట్టు పోతే అందరిని దిగజార్చే విధంగా ఉంది. అసలికి మీ ఉద్దేశం ఆంధ్రలో ప్రభుత్వం అనేది ఉండకుడదా? నిద్దర లేచిన మొదలుకొని టి.వి. లో పేపర్లో ఒకటే తప్పుడు తడికేల అనాల్సిస్ చేస్తారు. రోశయ్య ఉన్నని రోజులు ఇటువంటి రాతలతో పీక్కు తిన్నారు. మళ్ళీ అప్పుడే మొదలు పెట్టారు " జగన్ ఈ ప్రభుత్వానికి పోయేకాలం వచ్చిందని జగన్‌ తన ప్రసంగంలోని మాటలో అంతరార్ధం ఏమిటో" అని.

    ReplyDelete
  2. నీతో..అవినీతో....మాకొక 'ముఖ్యమంత్రి ' కావాలి....ముక్కేమంత్రి కాదు...
    ఈ రాష్ట్ర రిమోట్..ఈ రాష్ట్రం లోనే ఉండాలి.....ఆ దోచుకునెదేదో..తెలుగోడు దోచుకుంటె..అదో తుత్తి...

    ReplyDelete