Saturday, July 16, 2011

బాదుడుకు వేళాయె...

బాదుడుకు మంచి సమయం..ఆలస్యం చేసిన ఆశాభంగం... అనుకుంటున్నట్లుంది కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రాంతీయ గొడవకు ఆజ్యం పోసిన కాంగ్రెస్‌ ఆ మంటల్లో బొగ్గులేరుకుంటోంది. రాజకీయ పార్టీలు, ప్రజలు ప్రాంతాలవారీగా విడిపోయి భావోద్వేగాల్లో మునిగి ఉండగా బాదుడుకు ఇదే సరైన సమయం అనుకుంది ప్రభుత్వం. ఆర్టీసి బస్‌ ఛార్జీలను అమాంతం పెంచి ప్రజల వీపు విమానం మోత మోగించింది. మామూలు రోజుల్లో అయితే బస్‌ ఛార్జీలు పెరిగితే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు పెల్లుబికేవి. విపక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళనలు చేసేవి. వారి ఆందోళనలకు మీడియాలో చోటు లభించేది. ప్రజలపై 500 కోట్ల రూపాయలను బాదినప్పటికీ ఈసారి పెద్దగా ప్రచారం రాలేదు. వామపక్షాలు మాత్రమే నిబద్ధతగా, సంప్రదాయ బద్ధంగా, తమ శక్తి మేరకు బస్‌ ఛార్జీల పెంపునకు నిరసగా ఆందోళనలు చేశాయి.

Friday, July 15, 2011

ఎందుకీ చిందులు?


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పదవులకు రాజీనామా చేసి రెండు వారాలవుతున్నా అధిష్టానంలో సుయ్యి సయ్యి లేదు. రాజీనామాలు చేసి తమ సంగతి తేల్చమని ఢిల్లీకి చక్కర్లు కొట్టిన నేతలు అక్కడ గర్వభంగం కావడంతో హైదరాబాద్‌కొచ్చి పడ్డారు. ఇక్కడ సిఎం, పిసిసి అధ్యక్షుడు బొత్సతో ఎడతెరపి లేకుండా భేటీల మీద భేటీలు వేసిన వారు 48 గంటల నిరశన దీక్ష చేపట్టారు. బుధవారం ఉదయం 10గంటలకు ప్రారంభించిన దీక్షలను శుక్రవారం ఉదయం 10 గంటల వరకు కొనసాగిస్తే 48 గంటలవుతుంది. కాని అర్థంతరంగా 14 గంటలకు ముందే దీక్షలను విరమించారు. దీక్షల ముగింపులో నేతలు ఏదో సాధించేసినట్లు చిందులేశారు. విచిత్రంగా డ్యాన్సులు చేశారు. ఏం సాధించినందుకు డ్యాన్స్‌ చేశారు?

Tuesday, July 12, 2011

మెగా ఆశాభంగం

కేంద్ర మంత్రి పదవి కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్న మెగాస్టార్‌ చిరంజీవికి కాంగ్రెస్‌ మరోసారి చెయ్యి ఇచ్చింది. కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం విలీనం ప్రతిపాదన తీసుకొచ్చిన ఎకె ఆంటోని కప్పు కాఫీ తాగి వెళ్లిపోయారు. అనంతరం దఫదఫాలుగా సోనియాగాంధీని, ఇతర కాంగ్రెస్‌ పెద్దలను ఢిల్లీకి పోయి కలిసొచ్చిన చిరంజీవి తనకు మంత్రి పదవి ఖాయమని సన్నిహితుల వద్ద చెప్పినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. కొన్ని పత్రికలు ఒక అడుగు ముందుకేసి చిరంజీవికి నౌకాయాన శాఖ ఇస్తున్నట్లు వార్తలు రాశాయి. చిరంజీవికి మంత్రి పదవి ఇవ్వట్లేదని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబి అజాద్‌ మంత్రివర్గ విస్తరణకు ఒక రోజు ముందే కూశారు. అదే జరిగింది. చిరుకు మరోసారి ఆశాభంగం ఎదురైంది. రాష్ట్రంలో నెలకొన్న ప్రాంతీయ గొడవల వల్లనే చిరంజీవికి పదవి ఇవ్వలేదని సర్దిచెపుతున్నారు కాంగ్రెస్‌, పిఆర్‌పి నేతలు.

ఎన్ని రోజులీ రాజీడ్రామాలు?


రాజీనామాలంటే రాజకీయపార్టీలకు కామెడీ అయిపోయింది. చీమ చిటుక్కుమంటే రిజైన్‌ లెటర్‌తో మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు రెడీ అవుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్‌ నేతలు తమకు తాము డెడ్‌లైన్‌ విధించుకొని రాజీనామా చేశారు. వారిని చూసి తెలుగుదేశం వారు రాజీనామా చేశారు. ప్రత్యేక ఉద్యమంపై ఎక్కడ పేటెంట్‌ పోతుందోనని టిఆర్‌ఎస్‌ వారు రాజీనామాలకు సై అన్నారు. తెలంగాణ మంటలపై బొగ్గులేరుకోడానికి ప్రయత్నిస్తున్న బిజెపి సరేసరి. విశాలాంధ్ర పేపరు నడుపుతున్న సిపిఐ వారిదీ రాజీనామాల బాటే. వందకుపైగా ఎమ్మెల్యేలు, పదికిపైగా ఎంపీలు రాజీనామా చేస్తే రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం రావాలి. కాని అలా జరగట్లేదు. విచిత్రమేంటంటే రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయడం. నిర్ణయం తీసుకోవాల్సిన వారే రాజీనామాలు చేయడమేంటి? ఈ ఆలోచన సగటు ప్రజలకు ఎక్కడొస్తుందోనని కాంగ్రెస్‌ నేతలు రోజుకో విన్యాసం మొదలుపెట్టారు.

Sunday, July 10, 2011

పునఃప్రారంభం

అనివార్య కారణాల వల్ల మార్చి నెలాఖరు నుండి మైలవరం బ్లాగ్‌ను అప్‌డేట్‌ చేయలేక పోయాను. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బాగ్‌ను పునఃప్రారంభిస్తున్నాను. గతంలో వలే మైలవరం బ్లాగ్‌ను ఆదరిస్తారని ఆశిస్తూ...