Thursday, February 17, 2011

ప్రధాని చెప్పినా టి-కాంగ్రెస్‌కు అర్థం కాలేదా?

పార్లమెంట్‌లో ప్రత్యేక తెలంగాణ బిల్లుపై కేంద్రం, పార్టీ అధిష్టానంతో అమీ తుమీ తేల్చుకునేందుకు ఢిల్లీలో మకాం చేసిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఇంకా అక్కడ ఎందుకు ఉన్నట్లు?... పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలను పురస్కరించుకొని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ బుధవారం ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం విషయంపై అడిగిన ప్రశ్నకు ప్రధాని జవాబు చెబుతూ చర్చలు, ఏకాభిప్రాయంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని కుండబద్దలు కొట్టారు. కేంద్ర నిర్ణయంపై అడిగిన మరో ప్రశ్నకు ఏకాభిప్రాయం సాధిస్తే బ్రిడ్జిని ఎలా దాటాలో ప్రభుత్వం నిర్ణయిస్తుందని తాపీగా చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనపై ఊహాజనీత ప్రశ్నలు వేయొద్దన్నారు. ప్రధాని ఈ విషయాలు చెప్పినాగాని ఇంకా టి-కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు ఇంకా ఢిల్లీని వదలకుండా కాలం గడుపుతూ డ్రామా చేస్తున్నారు.

కాంగ్రెస్‌ కోర్‌కమిటీ సభ్యులతో భేటీల మీద భేటీలు వేసి నాటకాలు ఆడుతున్నారు టి-కాంగ్రెస్‌ నేతలు. విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు కాంగ్రెస్‌ ఎంపీలు ధర్నా చేసినా, వారి ధర్నాతో రాష్ట్ర ప్రభుత్వం కేసులు ఎత్తేసేందుకు ముందుకు వచ్చినా ఇదంతా డ్రామానే. తెలంగాణాలో ఇతర పార్టీల కంటే ఎక్కడ ఎనకబడతామోనన్న భయమే కాంగ్రెస్‌ను వెంటాడుతోంది. ఆ మాటకొస్తే టిడిపి, టిఆర్‌ఎస్‌, ఇలా ఎవరికి వారు రాజకీయ లబ్ధికోసమే పాకులాడుతున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్‌ విషయానికొద్దాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రారంభమైందని 2009 డిసెంబర్‌లో హౌం మంత్రి చిదంబరం ఎందుకు ప్రకటన చేయాలి? మళ్లీ ఆయనే ఎందుకు వెనక్కు పోవాలి? యుపిఎ-1 ప్రభుత్వం అప్పటి రాష్ట్రప్రతి ప్రసంగంలో ఎందుకు తెలంగాణ రాష్ట్ర అంశాన్ని ప్రస్తావించాలి?

కాంగ్రెస్‌ సంగతి సరే, ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడమే కాకుండా కేంద్రంలో కెసిఆర్‌ ఎందుకు మంత్రి పదవులు తీసుకోవాలి? ఎందుకు రాజీనామా చేయాలి? అంత సమైక్యవాదిగా చెబుతున్న వైఎస్‌ కూడా 2004లో టిఆర్‌ఎస్‌తో ఎందుకు పొత్తు పెట్టుకోవాలి? రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ టిఆర్‌ఎస్‌కు ఎందుకు మంత్రి పదవులు ఇవ్వాలి? టిడిపి సైతం సమైక్యవాదమని చెప్పి 2009 ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌తో ఎందుకు పొత్తు పెట్టుకోవాలి? ఇప్పుడు టిఆర్‌ఎస్‌, టిడిపి ఎందుకు అంతగా బద్ధ శత్రువులన్నట్లు విమర్శించుకోవాలి?

ఇదంతా రాజకీయ నేతల, పార్టీల నాటకాలు తప్ప మరేంకాదు. తొలుత సామాజిక న్యాయం అన్న చిరంజీవి అంతలోనే సమైక్యవాదాన్ని వినిపించి ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కాంగ్రెస్‌ ఏం చెబితే అదే అంటూ కొత్త నాటకానికి తెర తీశారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మంట పెట్టి బొగ్గులు ఏరుకోవాలని చూస్తోంది బిజెపి. వీరి ప్రయాశ కూడా రాజకీయ లబ్ధి కోసమే.

డ్రామాలు కట్టిపెట్టి ఢిల్లీ నుండి టి-కాంగ్రెస్‌ నేతలు రాష్ట్రానికొచ్చి ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తే మంచిది. రాజకీయ ప్రయోజనం కోసం పాకులాడకుండా ప్రాంతాలకు అతీతంగా అన్ని పార్టీలూ ప్రజలను పట్టించుకోవాలి. కాంగ్రెస్‌ అధిష్టానం కూడా అవకాశ వాదానికి తెర దించాలి.

2 comments:

  1. ప్రధాని చెప్పిన మాటలు తెలంగాణా కాంగ్రెస్ నేతలకు అర్ధం కాకపోవడం ఏమిటి ...
    మైండ్ దిమ్మతిరిగి బ్లాంక్ అయిపొయింది.!!!!!
    ఏం చేయాలో తెలియక ,
    తెలంగాణా ప్రజలముందు బొంకడానికి ఏమీ లేక
    చేతులు పిసుక్కుంటూ కూర్చున్నారు.

    >>> చర్చలు, ఏకాభిప్రాయంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని కుండబద్దలు కొట్టారు.<<<<
    కుండ కాదు
    తెలంగాణా కాంగ్రెస్ నేతల బుర్రలు బద్దలుకొట్టారు మహాను భావుడు,
    ధర్మ ప్రభువు!

    దగుల్భాజీ రాజకీయ అవకాశ వాద వైరస్ ప్రభావం
    మొత్తం సమాజం మీద ఎలా వుందో,....
    ప్రజల మనసులను ఆ అంటూ రోగం ఎలా కలుషితం చేస్తోందో ...
    గ్రహించేందుకు మీ టపాయే ఒక ఉదాహరణ.

    ఏమిటీ......?
    >>>>> డ్రామాలు కట్టిపెట్టి ఢిల్లీ నుండి టి-కాంగ్రెస్‌ నేతలు రాష్ట్రానికొచ్చి
    ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తే మంచిదా ???? <<<<<<<<

    ఆహా .....!
    ప్రజా సమస్యలు .... అసెంబ్లీ .... చర్చ....
    అక్కడే కదా "కేంద్ర నిర్ణయానికి కట్టుబడి వుంటాం ,
    మీరు తెలంగాణా పై బిల్లు పెట్టండి మేం సమర్ధిస్తాం అని
    అన్ని రాజకీయ పార్టీలు చర్చించి ప్రతిజ్ఞలు చేసింది.
    ఎన్నికలలో తెలంగాణా పై హామీ యిచ్చే కదా అన్ని పార్టీలు వోట్లు దండుకున్నది.

    >>>>> రాజకీయ ప్రయోజనం కోసం పాకులాడకుండా
    ప్రాంతాలకు అతీతంగా
    అన్ని పార్టీలూ ప్రజలను పట్టించుకోవాలి ????? <<<<<<
    వహ్వా .....! క్యా డైలాగ్ హై !

    >>>>>> కాంగ్రెస్‌ అధిష్టానం కూడా అవకాశ వాదానికి తెర దించాలి ????? <<<<<<<
    ఓ హో హ్హో !!!
    సూపరో సూపరు .

    ReplyDelete
  2. Goutham Navayan ki, mee coment also supeooo super. thak u

    ReplyDelete