Wednesday, November 17, 2010

' సూక్ష్మ' టెండర్‌

  • వెయ్యి కోట్ల బెయిలవుట్‌
  • బ్యాంకులకు బీసీలు మేమే
  • మల్టిపుల్‌ క్రెడిట్‌ బ్యూరో అవతారం
  • బ్రాంచ్‌లెస్‌ బ్యాంకింగ్‌ ఎజెండా
  • రాష్ట్రంలో పెరిగిన రుణాలు
మైక్రో ఫైనాన్స్‌ ఇండియా-2010 శిఖరాగ్ర సదస్సు ఢిల్లీ వేదికపై నుంచి సూకë సంస్థలు బీద అరుపులు అరిచాయి. మహిళల ఉసురు పోసుకుంటూ, ఆత్మహత్యలకు కారణమవుతున్న మైక్రోలు తమకు కేంద్రం వెయ్యి కోట్ల బెయిలవుట్‌ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేశాయి. బ్యాంకులు తమను బిజినెస్‌ కరస్పాండెంట్లు (బిసి)గా పెట్టుకోవా లని కోరాయి. తాము రుణాలకే పరిమితం కాకుండా అన్ని పనులకూ పనికొచ్చేలా మల్టిపుల్‌ క్రెడిట్‌ బ్యూరోలుగా మార్పు చెందాలని నిర్ణయించాయి.ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ వల్ల తామెంతగానో నష్టపోయినట్లు మైక్రోలు వాపోతుండగా, ఆ ప్రచారంలో నిజం లేదని ఢిల్లీలో సోమవారం ప్రారంభమైన సదస్సులో విడుదల చేసిన నివేదికలు చెబుతున్నాయి. రాష్ట్రంలో గత ఏడాది మార్చి నాటికి మైక్రోలు 12 వేల కోట్ల రూపాయలు రుణాలివ్వగా, ఈ ఏడాది మార్చి నాటికి 18 వేల కోట్లకుపైగా రుణాలు పంపిణీ చేశాయి. గత సంవత్సరం కంటే ఆరు వేల కోట్లు అదనంగా రుణాలిచ్చాయి. సదస్సును ఏర్పాటు చేసిన 'యాక్సెస్‌ డెవలప్‌మెంట్‌ సర్వీస్‌' రూపొందించిన 2010-స్టేట్‌ సెక్టార్‌ రిపోర్టులో ఈ వివరాలు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దేశంలోనూ, రాష్ట్రంలోనూ మైక్రోలకు క్లయింట్లు భారీగా పెరిగారు.
దేశవ్యాప్తంగా 2.67 కోట్ల మంది క్లయింట్లున్నారు. గత ఏడాది కంటే ఈ రిపోర్టులో 41 లక్షల మంది పెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తెచ్చాక అధికారికంగా మైక్రోలు తమ వివరాలను అధికారుల వద్ద రిజిస్టర్‌ చేయించుకున్నాయి. దాదాపు 2.15 లక్షల స్వయం సహాయ బృందాల్లోని 97.41 లక్షల మంది సభ్యులకు రూ.12,637 కోట్ల రుణాలు పంపిణీ చేసినట్లు ప్రభుత్వానికి తెలిపాయి. ఇచ్చిన రుణాల్లో ఇప్పటికే 5,379 కోట్లు అసలు, దానిపై వడ్డీ 1,329 కోట్లు వసూలయ్యాయి. ఇంకా ఆరు వేల కోట్లు వసూలు కావాలి. ప్రభుత్వ లెక్కలిలా ఉంటే ఈ ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలో మైక్రోలు 18 వేల కోట్లు పంపిణీ చేశాయని ఆ సదస్సులో వెల్లడైంది. ప్రభుత్వానికి మైక్రోలు గత సంవత్సర లెక్కలిచ్చాయని తెలుస్తోంది. రుణాల పంపిణీ అంతకంతకూ పెరుగుతుండగా ఒక రాష్ట్రానికి పరిమితమైన ఆర్డినెన్స్‌ను చూపి మైక్రోలు ఆందోళన నటిస్తున్నాయి. ఆర్డినెన్స్‌ వల్ల ఎస్‌కెఎస్‌ వాటా విలువ మంగళవారం ఆరు శాతం పతనమైందంటున్నాయి. రాష్ట్రంలో ఆరు వేల కోట్ల రూపాయల రీపేమెంట్స్‌ ఆగిపోవడంతో తాము ఇబ్బందుల్లో పడ్డట్లు మైక్రో సంస్థలు వాదిస్తున్నాయి. లిక్విడిటీ సొమ్ము కోసం కేంద్ర ప్రభుత్వం కనీసం వెయ్యి కోట్ల రూపాయల బెయిలవుట్‌ ప్యాకేజీ ఇవ్వాలని అందులో ప్రతిపాదించి నట్లు తెలిసింది.
మైక్రోలకు రీపేమెంట్స్‌ రాకపోతే అప్పులిచ్చిన ప్రభుత్వరంగ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడుతుందని ఆ సదస్సును ప్రారంభిస్తూ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్‌ రంగరాజన్‌ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని మైక్రోలు తమకనుకూలంగా మార్చుకున్నాయి. నాబార్డు, సిడ్బీ, తదితర సంస్థలకు ఇబ్బంది కలుగుతున్న పరిస్థితుల్లో తమకు తక్షణం ప్రభుత్వం ఉద్దీపన పథకాన్ని ప్రకటించాలని కోరుతున్నట్లు తెలిసింది. లిక్విడిటీ సొమ్ము కోసం బ్యాంకుల నుండి కొత్తగా రుణాలు సేకరించడం సాధ్యం కాదని కొన్ని మైక్రోలు పేర్కొంటున్నాయి.
బిసిల అవతారం
అందునలో పాల్గొన్న దేశంలో అతిపెద్ద 'సూక్ష్మ' సంస్థ ఎస్‌కెఎస్‌ ఛైర్మన్‌ విక్రమ్‌ ఆకుల మాట్లాడుతూ బ్యాంకులు మైక్రోలను బిజినెస్‌ కరెస్పాండెంట్లుగా నియమించాలని, లేకపోతే తమ మనుగడ కష్టమ న్నట్లు సమాచారం. గ్రామీణ పేద మహిళలు జాగ్ర త్తగా డబ్బు దాచుకోలేరని, అందువల్ల బ్యాంకులకు బిజినెస్‌ కరెస్పాండెంట్లు (బిసి)గా మారి మహిళలకు బ్యాంకింగ్‌ సేవలు అందిస్తామని, అలాగే బ్యాంకులకు కొత్త సేవింగ్‌ ఖాతాలు అందిస్తామని ప్రతిపాదించి నట్లు తెలిసింది. మైక్రోఫైనాన్స్‌ సంస్థల నెట్‌వర్క్‌ (ఎంఎఫ్‌ఎన్‌) ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి సూక్ష్మ సంస్థలు మల్టిపుల్‌ క్రెడిట్‌ బ్యూరోలుగా మారతాయని ప్రకటించారు. మైక్రోలు అత్యధికంగా 24-36 శాతం వడ్డీని వసూలు చేస్తున్నా యని, వాటిపై నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ అవసర మని, సూక్ష్మ సంస్థలు తమకు తాముగా మార్పు చెందా లని రంగరాజన్‌ సూచించగానే తాము బ్యాంకులకు బిసిలుగా మారతామని, మల్టిపుల్‌ క్రెడిట్‌ బ్యూరోల అవతారం ఎత్తుతామని మైక్రోలు పేర్కొనడం గమనర్హాం.
యాక్సెస్‌.. జాదు
సదస్సును నిర్వహిస్తున్న యాక్సెస్‌ సంస్థ ఎటువంటి లాభాలనూ ఆశించని నాన్‌ గవర్నమెంటల్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్‌జిఒ) అని ప్రచారం జరుగుతున్నా అందులో నిజం లేదు. డిఎఫ్‌ఐడి నిధులతో నడుస్తున్న సిఎస్‌హెచ్‌ఇ ప్రాజెక్టులో భాగంగా యాక్సెస్‌నడుస్తోంది. 'సొమ్ము పంపిణీ, డిమాండ్‌ మధ్య వారధి నిర్మాణం' ఈ సంస్థ నినాదం. మైక్రో ఫైనాన్స్‌ సంస్థలకు నిధులు సేకరించడమే లక్ష్యంగా ఏటా మైక్రోఫైనాన్స్‌ ఇండియా సదస్సులను యాక్సెస్‌ నిర్వహిస్తోంది. యాక్సెస్‌లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 15 సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. కన్సల్టేటివ్‌ గ్రూప్‌ టు అసిస్ట్‌ ది పూర్‌ (సిజిఎపి), సిటి గ్రూప్‌, ఫోర్డ్‌ ఫౌండేషన్‌, ఫ్రండ్స్‌ ఆఫ్‌ ఉమెన్స్‌ వరల్డ్‌ బ్యాంక్‌ ఇండియా (ఎఫ్‌ఎఫ్‌డబ్ల్యుబిఐ), హిందూస్థాన్‌ యునిలివర్‌ లిమిటెడ్‌ (యు), ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఎఫ్‌సి), ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ మైక్రో ఫైనాన్స్‌ ఫర్‌ ఉమెన్‌, సౌత్‌ ఏషియా మైక్రో ఫైనాన్స్‌ నెట్‌వర్క్‌ (ఎస్‌ఎఎంఎన్‌), నాబార్డు, సిడ్బీ, రాబో బ్యాంక్‌ గ్రూప్‌, యుఎన్‌డిపి, హెచ్‌ఎస్‌బిసి, ఎసిటిఇడి, డిఎఫ్‌ఐడి సంస్థలు యాక్సెస్‌లో భాగస్వాములు. భాగస్వామ్య సంస్థలు 15 అయినప్పటికీ దానిలో ఒక్కో దానికి మరెన్నో సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. ఆర్థిక సంస్థలన్నింటినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి మైక్రోలకు నిధులు, సాంకేతిక పరిజ్ఞానం అందజేయడమే యాక్సెస్‌ ఎజెండా. యాక్సెస్‌లో భాగస్వామి అయిన సిజిఎపి ప్రతి ఏడాదీ స్టేట్‌ సెక్టర్‌ రిపోర్టును రూపొందిస్తోంది. వచ్చే పదేళ్లలో బ్రాంచిలెస్‌ బ్యాంకింగ్‌ను అభివృద్ధి చేయాలని సూచిస్తోంది. అంటే బ్యాంక్‌ బ్రాంచీలు లేకుండా బ్యాంకింగ్‌ సర్వీసులు ప్రజలకు అందాలన్నమాట. మారుమూల ప్రాంతాల్లో బ్యాంకులు బిసిలను నియమించేది అందుకే. బ్యాంకులు తమను బిసిలుగా పెట్టుకోవాలని ఎస్‌కెఎస్‌ చీఫ్‌ విక్రం ఆకుల, మల్టిపుల్‌ క్రెడిట్‌ బ్యూరోలుగా మారతామని ఎంఎఫ్‌ఐఎన్‌ అంటున్నదీ సిజిఐపి నివేదికకు లోబడేనని తెలుస్తోంది.

1 comment:

  1. మీపోస్ట్ బాగుంది వార్తలు బాగున్నాయి

    ReplyDelete