Monday, November 29, 2010

ప్చ్‌... చిరంజీవి!


కాంగ్రెస్‌ కౌగిల్లోకి ప్రజారాజ్యం చేరుతుందా? ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడ మెజార్టీ ఉన్నప్పటికీ ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌ ఎందుకు అక్కున చేర్చుకుంటోంది? ఈ ప్రశ్నలు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మంత్రివర్గంలో పిఆర్‌పి చేరికపై ఊహాగానాలు జోరందుకున్నాయి. పిఆర్‌పి ఏర్పాటే అనుమానాస్పదం. కాంగ్రెస్‌కు, టిడిపికి ప్రత్యామ్నాయని, సామాజిక న్యాయమని తిరుపతిలో పార్టీ ఏర్పాటు సభలో ప్రకటించిన మెగాస్టార్‌ చిరంజీవి తర్వాత ఆ పలుకులకు దూరం జరిగారు. ఎన్టీఆర్‌ వలే పార్టీ పెట్టగానే ముఖ్యమంత్రి అవుదామనుకుంటే స్వయంగా చిరంజీవే ఒక నియోజకవర్గంలో ఓడిపోవడం విధి విచిత్రం. పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలకు పిఆర్‌పి పరిమితమైనప్పటికీ ఆ పార్టీకి 18 శాతం ఓట్లు వచ్చాయి. ఓట్ల చీలిక మూలంగానే టిడిపికి అధికారం దక్కకపోగా చావుతప్పి కన్నులొట్ట పోయినట్లు కాంగ్రెస్‌ అధికారం హస్తగతం చేసుకుంది. ఎన్నికల తర్వాత జెండా పీకేస్తారని, చిరంజీవి సినిమాల్లో నటిస్తారని వార్తలొచ్చాయి. 
 
వైఎస్‌ ఉన్నప్పుడే పిఆర్‌పి ఎమ్మెల్యేల్లో చాలా మంది కాంగ్రెస్‌ శిబిరంలో కనిపించేవారు. వైఎస్‌ మరణం తర్వాత గ్రేటర్‌ హైదరాబాద్‌లో జరిగిన ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్‌లో పిఆర్‌పి విలీనమవుతుందని, కనీసం పొత్తయినా పెట్టుకుంటుందని అనుకున్నారు. జగన్‌కు చెక్‌ పెట్టేందుకే పిఆర్‌పిని ప్రోత్సహిస్తున్నారని తెలిసి వైఎస్‌ గ్రూపు పిఆర్‌పితో పొత్తును వ్యతిరేకించింది. చివరి నిమిషంలో హైదరాబాద్‌లో కొంత మందిని పోటీ పెట్టి ఒకేఒక్క కార్పొరేటర్‌ సీటును దక్కించుకుంది పిఆర్‌పి.

రాజ్యసభ ఎన్నికలకు ముందు చిరంజీవి ఢిల్లీలో సోనియాను కలవడంతో మళ్లీ రెండు పార్టీల మధ్య బంధం బలపడింది. జగన్‌ గ్రూపులో కదలికలు ఊపందుకున్న ప్రతి సమయంలోనూ ప్రభుత్వం సంక్షోభంలో పడితే మద్దతిస్తామని చిరంజీవి చెబుతూ వచ్చారు. రోశయ్య మార్పుతో మంత్రివర్గంలో పిఆర్‌పి చేరికపై ఊహాగానాలు వెలువడుతున్నాయి. రోశయ్యతో కలిసి చిరు ఢిల్లీ వెళ్లడం నుండి కొత్త సిఎం కిరణ్‌తో చిరు భేటీ వరకూ జరిగిన పరిణామాలన్నీ మంత్రివర్గంలో పిఆర్‌పి చేరికను బలపరుస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి పదవి చిరంజీవికి ఇస్తారనుకుంటే తెలంగాణాకు వెళ్లిపోయింది. ఇక మిగిలినవి మామూలు మంత్రి పదవులు. మంత్రివర్గ కూర్పుపై పార్టీ అధిష్టానంతో చర్చించాక చిరంజీవికి సిఎం ఫోన్‌ చేయడం, ఆ కాల్‌తో చిరంజీవి పార్టీ ముఖ్య నేతలతో భేటీ కావడం, పూర్తిస్థాయిలో సోమవారం రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతాయనడం చూస్తుంటే కేబినెట్‌లో పిఆర్‌పి చేరడం ఖాయమని అనిపిస్తుంది.

ఇప్పుడు పిఆర్‌పి అవసరం కాంగ్రెస్‌కు ఏమొచ్చిందనేదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ప్రస్తుతం కాంగ్రెస్‌కు అనుబంధ (స్వతంత్ర) సభ్యులతో కలిపి 159 మంది ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 148 మంది ఎమ్మెల్యేలు సరిపోతారు. జగన్‌ వల్ల కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో చీలికొస్తే పిఆర్‌పి మద్దతు తీసుకొని మంత్రివర్గంలో చేర్చుకోవచ్చు. జగన్‌ ఎమ్మెల్యేలను చీల్చకముందే సాధారణ మెజార్టీకి ఎక్కువగానే ఎమ్మెల్యేలున్నా పిఆర్‌పిని ఎందుకు చేర్చుకుంటున్నట్లు? కేబినెట్‌లో చేర్చుకుంటున్నారా లేక మలివిడత విస్తరణ ఉంటుందని ఆశ పెట్టి పిఆర్‌పిని వెయిటింగ్‌లో ఉంచి జగన్‌ కదలికలను గమనిస్తున్నారా అనే విషయాన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. జగన్‌ విషయంలో కాంగ్రెస్‌కు ఉన్న సమాచారం ఏంటి? జగన్‌ చీలిక పెట్టకుండానే మూడో నాలుగో మంత్రి పదవులు పిఆర్‌పికి కట్టబెడితే కాంగ్రెస్‌లో ముసలం పుట్టడం ఖాయం. ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్సీలతో పాటు ఎమ్మెల్యేలూ మంత్రి పదవులు ఆశిస్తున్నారు ఆశావహుల సంఖ్య 100 నుండి 150 వరకూ ఉందంటున్నారు. ఇంత పోటీలోనూ అనవసరంగా పిఆర్‌పికి పదవులు కట్టబెడితే ప్రజాస్వామ్యం ఎక్కువ పాళ్లు కలిగిన కాంగ్రెస్‌ వీధి పోరాటాలకు దిగడం మామూలే. ఇక అవసరం లేకపోయినా టిఆర్‌ఎస్‌కు స్థానం కల్పించిన వైఎస్‌ స్వల్ప కాలంలోనే ఈడ్చి తన్నారంటారు టిఆర్‌ఎస్‌ నేతలు. కాంగ్రెస్‌ది దృతరాష్ట్ర కౌగిలని అప్పట్లో ఆ పార్టీ నేతలు విమర్శించారు. పిఆర్‌పి ఏమవుతుందో పాపం!

No comments:

Post a Comment