Monday, November 15, 2010

సూక్ష్మ రాక్షసం చతుష్టయం పనే

అత్యధిక వడ్డీలతో ప్రజల రక్తాన్ని పీలుస్తూ, గ్రామాల్లో చెలరేగిపోతూ, పేదల ఆత్మహత్యలకు కారణమవుతున్న మైక్రో ఫైనాన్స్‌ సంస్థలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రిజర్వ్‌బ్యాంక్‌ (ఆర్‌బిఐ) ఏమీ చేయలేకపోవడానికి కారణమేంటి? ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను సైతం ధిక్కరించే ధైర్యం సూక్ష్మ సంస్థలకు ఎలా వచ్చింది? ఈ ప్రశ్నలకు జవాబులు సామాన్యుల మెదళ్లకు తట్టలేక పోవచ్చు. ప్రపంచబ్యాంక్‌, కేంద్రం, ఆర్‌బిఐ, మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు దుష్టచతుష్టయంగా ఏర్పడినందువల్లనే మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు సైతం 'సూక్ష్మ' పోటు తప్పట్లేదన్నది సత్యం. ప్రైవేట్‌ మైక్రో ఫైనాన్స్‌ వ్యవస్థ ప్రపంచబ్యాంక్‌ అమ్ములపొదిలో నుండి వచ్చిందన్న సంగతి తెలిసిందే. 

సూక్ష్మ ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ప్రపంచబ్యాంక్‌ ఈ ఏడాది జులై రెండో వారంలో భారత దేశానికి సుమారు రూ.1900 కోట్ల రుణం మంజూరు చేసింది. మైక్రో సంస్థల అభివృద్ధికి ఈ రుణాన్ని వినియోగించాలని షరతు పెట్టింది. రెండు ప్రత్యేక ప్రాజెక్టుల కింద ఇచ్చిన రుణానికి రెండు వేర్వేరు ఒప్పందాలపై స్మాల్‌ ఇండిస్టీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (సిడ్బి), కేంద్ర ప్రభుత్వం, ప్రపంచబ్యాంక్‌ అధికారులు సంతకాలు చేశారు. సిడ్బీకి ప్రపంచబ్యాంక్‌ రుణం ఇస్తుంది. మైక్రో సంస్థలకు సిడ్బీ అప్పులిస్తుంది. సూక్ష్మ సంస్థలను ప్రోత్సహించడం కోసమే ప్రపంచబ్యాంక్‌ నిధులను సిడ్బీ వినియోగిస్తుంది. 'స్కేలింగ్‌ ఆఫ్‌ సస్టయినబుల్‌ అండ్‌ రెస్పాన్సబుల్‌ మైక్రో ఫైనాన్స్‌' అనే ప్రాజెక్టుకు ప్రపంచబ్యాంక్‌ 300 మిలియన్‌ డాలర్లు (రూ.1,350 కోట్లు) ఇస్తోంది. 

సూక్ష్మ సంస్థల సామర్ధ్యం పెంచడానికి, అవి అభివృద్ధి చెందడానికి, మరింత ఎక్కువ మంది ప్రజలకు రుణాలివ్వడానికి ఈ నిధులు ఖర్చు చేస్తారు. ఏ సంస్థలకు ఈ ప్రాజెక్టు కింద రుణాలివ్వాలనేదానికి సిడ్బీ మార్గదర్శకాలు రూపొందించింది. క్రిసిల్‌ వంటి సంస్థల రేటింగ్‌ ఉన్న వాటికి, మెరుగైన ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వాటికి రుణాలివ్వాలని నిర్ణయించింది. మైక్రో సంస్థల్లో కెపాసిటీ బిల్డిండ్‌, లిక్విడిటీ మేనేజ్‌మెంట్‌, ఈక్విటీ, ట్రాన్స్వర్‌మేషన్‌ లోన్‌, మైక్రో ఎంటర్‌ప్రైజ్‌ లోన్‌, మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌ లోన్‌ స్కీం, లోన్‌ సిండికేషన్‌ తదితరాలకు రుణాలిస్తుంది. దేశంలో ప్రతి కుటుంబాన్నీ, ప్రతి వ్యక్తినీ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూషన్‌లో చేర్చడంలో భాగంగా అందరికీ బ్యాంక్‌ అకౌంట్‌ ఇవ్వాలని ఆర్‌బిఐ కొన్నేళ్లుగా ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. జాతీయ బ్యాంకు బ్రాంచిల్లేని గ్రామీణ ప్రాంతాల ప్రజలను సైతం ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూషన్‌ అమలు చేయడానికి మైక్రో సంస్థలను వినియోగిస్తోంది. అయితే ఈ కార్యక్రమాన్ని సూక్ష్మ సంస్థలు సరిగ్గా ఆమలు చేయలేకపోతున్నాయని ఆర్‌బిఐ గుర్తించింది. 

ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూషన్‌ కార్యక్రమంలో మైక్రో సంస్థలను భాగస్వాములను చేయడానికి సిడ్బీ రుణం ఇస్తుంది. ఇక 'ఇండియా స్టాటిస్టికల్‌ స్ట్రెంగ్తనింగ్‌' అనే మరో ప్రాజెక్టుకు 107 మిలియన్‌ డాలర్లు (రూ.481 కోట్లు) సిడ్బీకి ప్రపంచబ్యాంక్‌ ఇస్తోంది. సూక్ష్మ సంస్థలు పారదర్శకంగా పని చేయడానికి, బాధ్యతాయుతంగా ప్రజలకు రుణాలు ఇవ్వడానికి, రుణాల వసూళ్ల సామర్ధ్యం 99 శాతానికి చేర్చడం కోసం వాటిలో నైపుణ్యాన్ని పెంచడానికి ఈ రుణం ఇస్తారు. సిడ్బీ ఇచ్చే నిధులతో మైక్రో సంస్థలు ప్రజల్లో విశ్వసనీయత పెంచుకోవాలని ఒప్పందంలో పేర్కొన్నారు. 

సన్న, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఆర్థిక సాయం చేయాల్సిన సిడ్బీని మైక్రో సంస్థలకు అప్పులిచ్చే సంస్థగా ప్రపంచబ్యాంక్‌ మార్చింది. దానికి కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బిఐ వంత పాడాయి. క్రిసిల్‌ రేటింగ్‌ ఇచ్చిన టాప్‌టెన్‌ సూక్ష్మ సంస్థల్లో కొన్నింటికి ఈ రెండు నెలల్లోనే సిడ్బీ రుణాలిచ్చింది. మొదటి స్థానంలో ఉన్న ఎస్‌కెఎస్‌కు రూ.100 కోట్లిచ్చింది. షేర్‌ సంస్థకు రూ.100 కోట్లిచ్చింది. ఆసియాలో మైక్రో సంస్థల అభివృద్ధికి బంగ్లాదేశ్‌కు పెద్ద మొత్తంలో ప్రపంచబ్యాంక్‌ రుణాలిచ్చిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌ నమూనాలోనే షేర్‌ సంస్థ ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నందునే ఆ సంస్థకు సిడ్బీ రుణం ఇచ్చినట్లు సమాచారం. దేశంలోని జాతీయ బ్యాంకులకు ప్రపంచబ్యాంక్‌ రుణాలిస్తోంది. మైక్రో సంస్థలకు రుణాలివ్వడానికే ఈ పని చేస్తున్నట్లు భోగట్టా. ఇటీవలే షేర్‌ సంస్థకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) రూ.200 కోట్టిచ్చినట్లు చెబుతున్నారు. 

రాబోయే రోజుల్లో సిడ్బీకాని, జాతీయ బ్యాంకులు కానీ మైక్రో సంస్థలకు విరివిగా అప్పులివ్వనున్నాయి. ఇందుకు ఆర్‌బిఐ తన వంతు సాయం చేస్తోంది. ఎస్‌కెఎస్‌ వంటి సంస్థలు స్టాక్‌ ఎక్సేంజిలో పేరు నమోదు చేసుకుంటున్న నేపథ్యంలో సూక్ష్మ సంస్థల స్థాయి ఏ పాటిదో అర్థమవుతుంది. బజాజ్‌, సిడ్బీతో సహా ప్రపంచ వ్యాప్త ప్రాముఖ్యం కలిగిన ఆర్థిక సంస్థలు సిలికాన్‌వ్యాలీ బ్యాంక్‌, వినోద్‌ కోస్లా, శాండ్‌స్టోన్‌, యూనిటస్‌ తదితరాలు ఎస్‌కెఎస్‌లో భాగస్వాములుగా ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తంలో సూక్ష్మ వ్యవస్థ విస్తరించినందువల్లనే వాటి ఆగడాలు పెచ్చుమీరుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌనం దాల్చాయి. వాటికి ఊడిగం చేస్తున్నాయి. ఆర్డినెన్స్‌లు, రుణాల నియంత్రణ అంటూ ప్రజలను మభ్యపెడుతున్నాయి.

No comments:

Post a Comment