Thursday, January 20, 2011

జైపాల్‌రెడ్డికి పెట్రోలియం శాఖ దక్కడం వెనుక..?!

కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఈసారి కూడా మన రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీలకు నిరాశే మిగిల్చింది. రాష్ట్రం నుండి 33 మంది గెలిచినా తగిన సంఖ్యలో మంత్రులను తీసుకోలేదన్న అసంతృప్తి ఎంపీల్లో నెలకొంది. కేబినెట్‌ మంత్రి గతంలో ఒక్కరే ఉండేవారు. ఇప్పుడూ అంతే. కీలకమైన శాఖలు సైతం రాష్ట్రానికి ఇవ్వట్లేదన్న విమర్శిస్తున్న చేస్తున్న వారికి ఈసారి కొద్దిపాటి ఊరట కలిగింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన జైపాల్‌రెడ్డికి కీలకమైన పెట్రోలియం, సహజ వాయువుల శాఖను కట్టబెట్టారు. ఇప్పటి వరకూ ఆయన పట్టణాభివృద్ధి శాఖను నిర్వహించారు. జైపాల్‌రెడ్డికి పెట్రోలియం శాఖ దక్కడానికి వ్యాపార దిగ్గజం చక్రం తిప్పారని భోగట్టా.

ఆంధ్రప్రదేశ్‌ గ్యాస్‌పై అత్యధిక లాభాలు మూట గట్టుకోవాలని ఆ రంగంలో పేరుగాంచిన ప్రఖ్యాత వ్యాపార సంస్థ గతంలో యత్నించింది. దానికి గండి కొట్టారు కీర్తిశేషులు వైఎస్‌ రాజశేఖరరెడ్డి. రాష్ట్రానికి అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో వైఎస్‌ ఆ సంస్థకు వ్యతిరేకంగా పని చేశారని అప్పట్లో లోకం కోడై కూసింది. వైఎస్‌ తన కుటుంబానికి, తన అనుయాయూలకు లాభం చేకూర్చడానికే ఆ పని చేశారన్న వాదనలూ ఉన్నాయి. అయితే తనను అంతగా నష్ట పరిచిన వైఎస్‌ను హత్య చేయించేందుకు సదరు గ్యాస్‌ సంస్థ యజమాని కుట్ర పన్నారని ఏడాది క్రితం వెబ్‌సైట్లలో వార్తలొచ్చాయి. దానిపై వైఎస్‌ అభిమానులు ఆ సంస్థ దుకాణాలపై దాడులు చేశారు.

వైఎస్‌ మరణించిన తర్వాత ఆయన తనయుడు జగన్‌కు సిఎం పదవి ఇవ్వనీకుండా ఆ గ్యాస్‌ సంస్థ యజమానే కాంగ్రెస్‌ హైకమాండ్‌ వద్ద చక్రం తిప్పినట్లు అప్పట్లో ఢిల్లీలో పుకార్లు షికారు చేశాయి. ఎఐసిసిలో కీలక నేత, సదరు గ్యాస్‌ సంస్థ యజమాని ఒకే రాష్ట్రానికి చెందిన వారు, అత్యంత సన్నిహితులు కావడం విశేషం. పార్టీ కీలక నేత సోనియాగాంధీకి జగన్‌పై నూరి పోశారని కాంగ్రెస్‌ నేతలే అంటుంటారు. గ్యాస్‌ యజమాని ప్రోద్భలంతో ఎఐసిసిలోని కీలక నేత కుట్ర చేసి జగన్‌ కాంగ్రెస్‌ నుండి బయటికి వెళ్లే పరిస్థితులు సృష్టించారని ప్రచారం జరుగుతోంది.

ఇక జైపాల్‌రెడ్డి మొదటి నుండి వైఎస్‌కు వ్యతిరేకం. ఆయన శిష్యులుగా పేరుబడ్డ కొందరు కాంగ్రెస్‌ నేతలు వైఎస్‌కు, జగన్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో అధిష్టానం వద్ద చాడీలు చెప్పారంటున్నారు కాంగ్రెస్‌ నేతలు. ప్రస్తుతం రాష్ట్రంలోని గ్యాస్‌ను తరలించుకుపోడానికి, లాభాలు సాధించడానికి ఎఐసిసిలోని కీలక నేత వద్ద పైరవీ చేసిన గ్యాస్‌ యజమాని రాష్ట్రంలో వైఎస్‌ కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్న జైపాల్‌రెడ్డికి పెట్రోలియం శాఖ ఇప్పించారంటున్నారు. తనకు అనుకూలమైన మురళీదేవరాను ఆ శాఖ నుండి తప్పించడానికి, జైపాల్‌రెడ్డికి ఆ శాఖ దక్కడానికి ఎఐసిసిలోని కీలక నేత, ప్రధాని, గ్యాస్‌ యజమాని క్రియాశీల పాత్ర పోషించినట్లు భోగట్టా. జైపాల్‌కు పెట్రోలియం శాఖ దక్కడంపై జగన్‌ శిబిరంలో ఈ చర్చ జరుగుతోంది.

2 comments:

  1. Rumors
    Gossips
    Chitchats
    Anecdotes

    Rumors may be best suitable for this article...

    ReplyDelete