Wednesday, January 12, 2011

ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా కిరణ్‌ సర్కార్‌ పడిపోదా?

తాను తలుచుకుంటే కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం కూలుతుందంటున్నారు వైఎస్‌ జగన్‌. తమ సర్కార్‌కు జగన్‌ వల్ల ముప్పు ఉండబోదంటున్నారు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్ప మొయిలీ. జగన్‌ దయాదాక్షిణ్యాల మీద ప్రభుత్వం నడవట్లేదని, దమ్ముంటే తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్‌ విసురుతున్నారు మంత్రులు డిఎల్‌ రవీంద్రారెడ్డి, శంకర్రావు, తులసిరెడ్డి తదితరులు. జగన్‌ కానీ కాంగ్రెస్‌ నేతలు కానీ ఎవరు ఏం చెప్పినా సామాన్యులకు మాత్రం ప్రభుత్వ మనుగడపై అంతుబట్టకుండా ఉంది. కిరణ్‌కుమార్‌ సర్కార్‌ ఉంటుందా ఊడుతుందా అని లెక్కలు వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మీడియాలోనైతే నైతికంగా సర్కార్‌ మైనార్టీలో పడ్డట్లేనంటూ వార్తలొస్తున్నాయి.

మాది మేకపోతు గాంభీర్యం కాదు ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటాం, మాకూ కొన్ని లెక్కలున్నాయి అని వాదిస్తున్నారు కాంగ్రెస్‌ నాయకులు. వారి లెక్కలివి. రాష్ట్ర శాసనసభలో 294 స్థానాలున్నాయి. సర్కార్‌ను ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీకైనా ఉండాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య 148. ఇది మేజిక్‌ ఫిగర్‌. ప్రస్తుతం కాంగ్రెస్‌కు 155 మంది ఎమ్మెల్యేలున్నారు. జలదీక్ష, లక్ష్యదీక్ష, ఓదార్పు యాత్ర దేన్ని చూసినా పాతిక మంది ఎమ్మెల్యేలు మాత్రమే జగన్‌కు బహిరంగంగా మద్దతిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోడానికి కాంగ్రెస్‌కు ధైర్యం చాలట్లేదు. ఎందుకంటే వారిపై చర్యలు తీసుకుంటే కాంగ్రెస్‌ బలం 130కి పడి పోతుంది. ఈ లెక్కన చూస్తే జగన్‌ దయాదాక్షిణ్యాలపైనే సర్కార్‌ మనుగడ సాగిస్తోందని అనుకోవాల్సి ఉంటుంది.

కానీ ఇంకో లెక్క ఉంది. జగన్‌ మద్దతుదార్లు 25 మంది రాజీనామా చేసినా సర్కార్‌కు ఏమీ కాదు. పాతిక స్థానాలు ఖాళీ అయితే మొత్తం సభలో సభ్యుల సంఖ్య 269 అవుతుంది. అప్పుడు సభలో 136 మంది ఎమ్మెల్యేల మద్దతు పొందితే సర్కార్‌ గట్టెక్కుతుందంటున్నారు. పిఆర్‌పి మద్దతుతో గండం నుండి గట్టెక్కవచ్చంటున్నారు. ఒక వేళ పాతిక మంది గవర్నర్‌ వద్దకెళ్లి తాము ప్రభుత్వానికి మద్దతు ఇవ్వట్లేదని లేఖ ఇచ్చినా ఇటీవలి కర్నాటక పరిణామాలు ఇక్కడ పునరావృతం అవుతాయంటున్నారు. కాంగ్రెస్‌ సభ్యులు విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా సభలోకొచ్చి ఓటు వేయనివ్వరట. ముందుగానే స్పీకర్‌కు ఉన్న విచక్షణాధికారంతో పార్టీ ఫిరాయింపు కింద ఆ పాతిక మందిపైనా అనర్హతా వేటు వేసి సభలో విశ్వాసం పొందుతామంటున్నారు. అలా కాకుండా సభకు రానిచ్చి ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చి ఆ తర్వాత విప్‌ను ధిక్కరించారంటూ పాతిక మందిపై అనర్హత వేటు వేయవచ్చు. అయితే సభకొచ్చి వారు ఓటేస్తే ప్రభుత్వం కూలిపోతుంది.

కాంగ్రెస్‌కు పిఆర్‌పి మద్దతిస్తుందంటున్నా ఆ సమయానికి ఎంత మంది చిరంజీవి పక్కనుంటారో అనుమానమేనంటున్నారు విశ్లేషకులు. ఇక పోతే టిఆర్‌ఎస్‌, ఎంఐఎం సభ్యుల మద్దతును కాంగ్రెస్‌ కోరే అవకాశం ఉంది. వారి మద్దతు ఈ సమయంలో దానికి తలనొప్పి. సమైక్యరాష్ట్రానికి మద్దతివ్వాలి లేదా రాయలతెలంగాణా ఏర్పాటుకు అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని ఎంఐఎం షరతు పెట్టవచ్చు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అసెంబ్లీలో తీర్మానం పెడితేనే మద్దతిస్తామని టిఆర్‌ఎస్‌ అనే ప్రమాదముంది. అప్పుడు కాంగ్రెస్‌కు వెనుక గొయ్యి, ముందు గొయ్యి. కాగా తెలంగాణా రాష్ట్రం కోసం రాజీనామాలు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామన్నా దానికి పెద్దగా విలువ ఇవ్వట్లేదు విశ్లేషకులు. అలాగే సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలూ నిజంగా రాజీనామా చేస్తారన్న గ్యారంటీ ఏమీ లేదంటున్నారు. సమస్యల్లా జగన్‌ వల్లనే. జగన్‌ కూడా సొంత పార్టీ పెట్టకుండా, ఆ పార్టీ ప్రజల్లోకి వెళ్లకుండానే తన ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయిస్తే నష్టపోతారు. అందువల్ల ఇప్పుడే తన రాజీనామాల జోలికి జగన్‌ పోరంటున్నారు సీనియర్‌ రాజకీయ నేతలు.

1 comment:

  1. రెబెల్స్ పార్టీ లోనుంచి వెళ్లారు. వేల్లగోట్టుకుంటారు. బానిసలు, కుక్కలు, పందులు, ల కో , ము కో అని తిడితే వాళ్ళే బయటకు పంపిస్తారు. ఏదో టాపిక్ తెసుకొని గొడవ పెట్టుకుంటారు చుడండి వాళ్ళు.

    ReplyDelete